(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల మండలంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించి నిందితుడిని పట్టుకోవడంతో సంచలనం రేగింది. ఇంటి యజమాని కుటుంబంతో పెళ్లికి వెళ్లిన సమయాన్ని గమనించిన మైనర్ నిందితుడు, ఇంటి తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్ను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గురువారం కోరుట్ల సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె. లక్ష్మీనారాయణ కేసు వివరాలను వెల్లడించారు.
మాదాపూర్కు చెందిన తమ్మిశెట్టి శ్రీను ఈ నెల 17న తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన ప్రకాశం జిల్లాకు పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా ఇంటి తాళాలు పగులగొట్టబడి ఉండటం గమనించారు. బీరువాలో దాచిన రూ.4 లక్షల నగదు, రూ.20 వేల విలువైన సెల్ ఫోన్ దొంగిలించబడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసిన కోరుట్ల పోలీసులు, సీఐ కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సై ఎం. చిరంజీవి, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన బృందం రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించింది.
దర్యాప్తులో నిందితుడు నాగర్కర్నూల్కు చెందిన మైనర్గా గుర్తించారు. అతడు గతంలో ఫిర్యాదుదారుడు తమ్మిశెట్టి శ్రీను వద్ద పనిచేసిన వ్యక్తేనని పోలీసులు వెల్లడించారు. తన స్నేహితుడు ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేయడంతో తానూ ఎలాగైనా బైక్ కొనాలని ఆశపడి, జల్సాల కోసం ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన రూ.1.65 లక్షల విలువైన యమహా MT-15 బైక్, రూ.1.80 లక్షల నగదు, రూ.20 వేల విలువైన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జువెనైల్ జైలుకు తరలించారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన కానిస్టేబుళ్లు పురుషోత్తం, గట్టు శ్రీనులను డీఎస్పీ రాములు నగదు బహుమతితో అభినందించారు. అలాగే కేసు విచారణలో కీలకంగా పనిచేసిన సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై చిరంజీవిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
