(బాలే అజయ్ – 9290277727)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాలపాటు సాగిన ప్రజా ఉద్యమాలు, విద్యార్థుల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధ్యమైన చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం కోట్లాది ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరిగిన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు.
తెలంగాణ ఉద్యమానికి తొలి దశగా 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. అనంతరం కొంతకాలం ఉద్యమం నెమ్మదించినప్పటికీ, 2001 నుంచి 2014 వరకు మలి దశ ఉద్యమం మరింత ఉధృతంగా సాగిందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ సాధన కోసం పోరాడారని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ సాధిస్తేనే ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసంతో శ్రీకాంత్ చారి వంటి అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదన్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన మహా సంగ్రామంలో ఆత్మబలిదానాలు చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో బలమైన మద్దతు ప్రకటించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా వినిపించిన మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్లు ఇందూరి తిరుముల వాసు, గుగ్లావత్ శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపల్లి సాగర్, సీనియర్ నాయకులు సుదవేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్, పోతుగంటి శ్రీనివాస్, కాలాల సాయిచంద్, తులసి కృష్ణ, బెక్కం అశోక్, మ్యాకల గణేష్, గుండేటి రాజేందర్, సాడిగే మహేష్, తలపెల్లి శ్రీనివాస్, ఓం ప్రకాష్, సోరుపాక రమేష్, గుండేటి సంజీవ్, ధమ్మా సంతోష్, మైదం సత్యనారాయణ, కచ్చు రమేష్, మామిడి మల్లేష్, కస్తూరి జ్ఞానేశ్వర్, దామ శ్రవణ్, అక్మాల్, కైరం కొండా రాజా గంగాధర్, అక్కెనపెల్లి వెంకటరమణ, గొనె రాజారామ్, గడ్డం రాజశేఖర్, చింతకింది గోపాల్, ఉప్పులేటి రాఘవులు, ఒళ్ళోజి నగేష్, బాల్క ప్రేమ్ సాగర్ తదితర బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
