(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలోని వినోబా రోడ్లో ఉన్న సారథి చికెన్ సెంటర్ నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసనతో తాము నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జక్కుల గోపాల్తో పాటు పరిసర ప్రాంత మహిళలు మాట్లాడుతూ, చికెన్ సెంటర్ నుంచి వెలువడుతున్న మాంసపు వ్యర్థాల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఇదే రోడ్డులో మరికొన్ని చికెన్ సెంటర్లు ఉన్నప్పటికీ, వాటివల్ల ఏలాంటి సమస్యలు లేవని, అయితే ఈ సెంటర్లో మాత్రం గతంతో పోలిస్తే ప్రస్తుతం వందల సంఖ్యలో కోళ్లను కోస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నారు. గతంలో ఇరవై నుంచి ముప్పై కోళ్ల వరకు మాత్రమే కోసేవారని, ఇప్పుడు వందల సంఖ్యలో కోళ్లను కోయడం వల్ల భారీగా వ్యర్థాలు పేరుకుపోతూ భరించలేని దుర్వాసన వస్తోందన్నారు.
దీంతో ఈగలు, పందికొక్కులు, వీధి కుక్కలు ఎక్కువై చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికే మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసినా స్పందన రాలేదని తెలిపారు.
అదేవిధంగా చికెన్ సెంటర్కు వచ్చే వాహనాలను ఇళ్ల ముందు నిలిపివేయడం వల్ల పండుగల సమయంలో ముగ్గులు వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతోందన్నారు. మున్సిపల్ చెత్త సేకరణ సమయంలో చికెన్ వ్యర్థాలను తరలించే వేళ వచ్చే దుర్గంధాన్ని భరించడం చాలా కష్టంగా మారిందని చెప్పారు.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.

