గుండెల్లో ఎంత బాధవుంటే ఏం? నా కుటుంబం కంటే ఎక్కువా?

తెలంగాణ సామ్నా బ్యూరో: ‘‘గవన్ని నాకు చెప్పకే డాడీ. నాకు బైక్ కావాలా… నా సోపతోల్లందరికి బండ్లు ఉన్నయి….
నీ యవ్వ నాకు ఏం చెప్పకు. కొనిత్తవా లేకపోతే నూతిల దుంకుమంటవా? దోస్తుల ముందు విలువ పోయినంక బతుకుడెందుకే?’’ ఓ కొడుకు తండ్రికి ఫోన్ చేసి బెదిరించిన సన్నివేశం ఒకటి.
‘‘డాడీ. మంచిగానే సదువుకుంటున్న. కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్న. అన్ని కలిపి లక్షన్నర అయ్యేటట్టు వున్నయి. నీవు తీసుకోమంటే తీసుకుంట. లేకపోతే సదువు ఇక్కడికే ఆపేస్తా’’ ఓ కూతురు ఓ తండ్రికి తన భవిష్యత్తును తండ్రి చేతులో పెట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సరే అనే ఓ సగటు కూతురు. సన్నివేశం నంబర్ మూడు.
‘‘పెళ్లాం పొరగాళ్లను ఇడిసిపెట్టి ఓ గుమ్మున పోతివి. ఆ ఎంకట్రాజం గాడు అచ్చి పైసలు నెల రోజుల్ల ఇయ్యకపోతే సామానంత బయట పారేత్త అని పొల్లు పొల్లు తిట్టిపోయిండు. ఆనికి నువ్వేం చెబుతావో చెప్పుకో. ఆడు ఇంకోసారి ఇంటి ముంగటికి వస్తే ఇంగ ఇంట్ల నువ్వన్న వుండాలే. లేకపోతే నేనన్న వుండాలే. ఏం చెత్తున్నవు సంపాదించింనవు.’’ ఓ భార్య భర్తకు ఆవేశం, బాధ, అవమానం ఆపుకోలేక వేసే షంటింగ్స్. సన్నివేశం నంబర్ 3.
ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తర తెలంగాణ పల్లె బతుకుల్లో ఇలాంటి ఎన్నో సంఘటనలు కొకొల్లలు. సరైన నీటి వసతులు లేక వాటికి తోడు వ్యవసాయం అడుగంటడంతో పాటు తీవ్రవాద ఉద్యమాల పురిటి గడ్డ కావడంతో సహజంగా వచ్చే పోలీసుల వేధింపుల రోదనలు… గ్రామీణ యువతను గల్ఫ్ బాట పట్టించాయి. ఈ క్రమంలో గల్ఫ్ వెళ్లే సగటు వ్యక్తి ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురయ్యాడు.

దాదాపుగా 1980వ దశకంలో సౌదీ వెళ్లే వారికి అప్పు కావాలంటే తులం బంగారానికి మరో తులం కలిపి ఇచ్చే వడ్డీ వ్యవస్థ నడిచేది. అంటే బంగారానికి రెండిరతలు ఇవ్వడం అన్నమాట. ఆ తరువాత ఆ పద్ధతి పోయి భూములు, ఇండ్లు కుదువపెట్టి వడ్డీ ఇచ్చే పద్దతి వచ్చింది. ఈ పద్దతి ఇప్పటికి చెలామణిలో వున్నది.
అయితే ప్రస్తుతం సమస్య గల్ఫ్ అందులో ముఖ్యంగా సౌదీ వెళ్లే వారికి స్థానికంగా ఎక్కువగా గుర్తింపు వుండేది. దుబాయి, బెహరాన్ లాంటి దేశాల్లో విచ్చలవిడి తనం వుంటుందని అంటారు. కాని సౌదీలో విలాసాలకు చోటు లేకపోవడంతో అక్కడి సంపాదన చాలా మిగులుతుందని వారి కుటుంబ సభ్యులు చెబుతారు.
కష్టమో నష్టమో ఓ కుటుంబ శ్రేయస్సు కోసం ఆ కుటుంబ యజమాని తన వాళ్లందరిని వదిలి విదేశాలకు వెడుతున్నాడు. తను ఎక్కడ వున్నా తన కుటుంబ బాగోగుల కోసం ఎందరో తండ్రులు కనీసం రోజుకు ఒక్క చాయి కూడా తాగకుండా, ఎడేనిమిది నెలలకు సొంతంగా నెత్తి వెంట్రుకలు తీసుకునేంతగా పొదుపు చేసి తన కుటుంబం కోసం డబ్బులు పొదుపు చేస్తాడనేది బాధాకరమైన నిజమని చెప్పవచ్చు. ఎంతటి కష్టనష్టాలకు ఓర్చి బ్రతకుకు వెళ్లదీస్తున్న సగటు భారతీయునికి లేదా ప్ర్రత్యేకంగా చెప్పాలంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుండి విదేశాలకు వెళ్లిన చాలా మందికి తమ కష్టాలు కాని తన కుటుంబ కష్టాలు కాని తెలియనివి కావు. ఇంతటి కష్టాలు పడుతున్న సగటు ప్రవాస భారతీయునిపై సౌదీ ప్రభుత్వం కొరడా రaులిపిస్తుంది అనేది ప్రస్తుతం తాజాగా ఇబ్బందులు పెడుతున్న సమస్య.
ఎన్నో కష్టాలు ఓర్చి సౌదీలో ఉపాధి పొందుతున్న వారపై అక్కడి ప్రభుత్వం తాజాగా నిబంధనల్లో మార్పు చేసింది. అక్కడి వర్క్ పర్మిట్ అవసరం అనుకునే వారు ఇప్పటిలా కాకుండా తప్పకుండా విద్య, వృత్తి అర్హతలతో ముందస్తుగా వీసా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. అలాగే సదరు సర్టిఫికెట్లను తామే జారీ చేసామని సంబంధిత శాఖా దృవీకరణ పత్రాన్ని ఇవ్వవలసి వుంటుంది. ఇది ఇప్పటివరకు అక్కడ వుండి పని చేస్తున్న ఎందరో భారతీయులపై పరోక్షంగా, ప్రస్తుతం సౌదీ వెళ్లాలనుకునే వారిపై పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని ప్రవాస భారతీయులు చెబుతున్నారు.
ఈ నిబంధనను సౌదీ ప్రభుత్వం తొలగించేలా భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రవాసీయులు చెబుతున్నారు. లేకపోతే ఇప్పటికే నిరుద్యోగం గుప్పెట్లో కకావికలం వికలం అవుతున్న తెలంగాణ గ్రామీణ యువత మరిన్ని కష్టాలు పడే అవకాశాలు పుష్కలంగా వున్నాయని చాలా మంది చెబుతున్నారు.
