(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని లో-లెవెల్ బ్రిడ్జిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే, కల్లూరు గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, భారీ వర్షాల కారణంగా మిషన్ భగీరథ ప్రధాన పైపులు దెబ్బతినడంతో పలు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయిందని పేర్కొంటూ, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రభావిత గ్రామాలకు వీలైనంత త్వరగా తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదేశించారు.
