

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివమారాండేయ కోటి నవదుర్గ దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన “మనసార మన సారె” మహోత్సవం భక్తుల భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ముగిసింది.
మహోత్సవంలో భాగంగా వందలాది మంది మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా దేవాలయానికి చేరుకుని అమ్మవారికి 108 రకాల విశేష మంగళ ద్రవ్యాలను “మనసార మన సారె”గా సమర్పించారు. ఆలయ ప్రాంగణం జై భవానీ, జై జై దుర్గా నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ దేగామ ప్రదీప్ శర్మ, బ్రహ్మశ్రీ శ్రీధర్ శర్మ శాస్త్రోక్తంగా ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల భాగస్వామ్యంతో సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. వందలాది మంది మహిళలు ఏకస్వరంతో లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని లలితా పారాయణ కమిటీ సభ్యులు మచ్చ కవిత, మంచాల రోజా రమణి, జిల్లా దీపారాణి తెలిపారు.
కార్యక్రమం అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా భక్తులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్న వేళ, అమ్మవారి సన్నిధిలో అఖండ నామసంకీర్తన, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వర్షం కురవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దీనిని అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ, “అమ్మవారి కృపతో ప్రకృతి ప్రసన్నమైంది” అని ఆనందం వ్యక్తం చేశారు.
దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి, ఐకమత్యం, సాంప్రదాయ విలువలను పెంపొందించడమే కాకుండా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వేదపండితులు, మహిళలు, దాతలు, సేవకులు, భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులందరికీ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కోరుట్ల పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన విశిష్ట ధార్మిక వేడుకగా “మనసార మన సారె” మహోత్సవం నిలిచిందని భక్తులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనంజయ్, యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్ కుమార్, లలితా పారాయణ బృందం సభ్యులు ఆడెపు శశికళ, ఆడెపు కమల, కొత్త శోభ, చింతగింది మంజుల, నాగమణి, కడకుంట్ల లీలావతి, గుంటుక సురేఖ, ఆడెపు గీత, పసునూరి మమత, రేగుంట విజయ, ఆదిలక్ష్మి, జక్కుల సౌజన్య, రుద్ర స్వాతి, అలాగే పద్మశాలి సంఘం, యువత కమిటీ సభ్యులు కటకం వినయ్, బండ్ల రవికుమార్, అందే రాజ్కుమార్, పడాల గణేష్, ఎక్కలదేవి రామచంద్రం, బండి సురేష్, చింతకింది ప్రేమ్, రాడం మహేందర్, రుద్ర విఘ్నేష్, గాజింగి మనీష్, బైరి ఆనంద్, ఆలయ కమిటీ సభ్యులు ఆడెపు నరేష్, రుద్ర సురేష్, కటకం రవి, అందే రాజేంద్రప్రసాద్, అందే సురేష్, గోనె ఉమాపతి తదితరులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
