
(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల, జూన్ 12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలు) అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కోరుట్ల పట్టణంలోని కావేరి గార్డెన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు, పీసీసీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పరిశీలకుడు రుద్ర సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఎల్ఏలకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు పీసీసీ రూపొందించిన ఎస్ఐఆర్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ వద్ద పార్టీ అందజేసిన కిట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాల సందర్భంగా లక్షలాది ఓట్లు తొలగింపునకు గురైన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంటూ, కోరుట్ల నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు.
అనంతరం ఎస్ఐఆర్ పరిశీలకుడు రుద్ర సంతోష్ లైవ్ డెమో ద్వారా బీఎల్ఏలకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, నమోదు విధానం, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులపై సవివరంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీసీసీ జాయింట్ సెక్రటరీ బండ శంకర్, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైసొద్దీన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
