
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఛైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ హాజరయ్యారు.
సమావేశంలో అజెండాలో పొందుపరిచిన వివిధ అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రత పనులను వేగవంతం చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని వార్డు సభ్యులు అధికారులను కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా నిర్వహించాలని సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వార్డుల్లో మురికి కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఛైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్, ఉపాధ్యక్షులు, కౌన్సిల్ సభ్యులు, సహనియమిత సభ్యులు, మున్సిపల్ కమిషనర్, ఉప కార్యనిర్వహణ ఇంజనీర్, మేనేజర్, పట్టణ ప్రణాళిక అధికారి, జూనియర్ ఖాతాల అధికారి, రెవెన్యూ అధికారి, శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
