(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R.) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో నమోదైన వివరాలను పరిశీలించడంతో పాటు, ఓటర్లకు ఎదురవుతున్న అనుమానాలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం యాఖీన్పూర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి, కోరుట్ల తహశీల్దార్ సంయుక్తంగా పాల్గొని ఓటర్లకు పలు అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ S.I.R. ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తన పేరు, వయస్సు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (EPIC) తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేరు లేదా ఇతర వివరాల్లో తేడాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి, సంబంధిత BLO/ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Anomalies అంటే ఓటర్ల జాబితాలో గుర్తించబడిన వివరాల మధ్య తేడాలు, అసంగతతలు లేదా ధృవీకరణ అవసరమైన అంశాలు. ఉదాహరణకు ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల కనిపించడం, మరణించిన వ్యక్తి పేరు కొనసాగడం, ఒక వ్యక్తి వేరే ప్రాంతానికి శాశ్వతంగా మారినప్పటికీ పాత చిరునామాలో పేరు ఉండటం, పేరు–వయస్సు–బంధుత్వ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం వంటి అంశాలు పరిశీలనకు రావచ్చు.
ఇలాంటి వివరాలకు సంబంధించి ఓటరు తన వద్ద ఉన్న గుర్తింపు, వయస్సు, నివాసం లేదా సంబంధిత వివరాలను నిర్ధారించే పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల/విద్యా రికార్డులు, నివాసానికి సంబంధించిన పత్రాలు, కుటుంబ సంబంధాలను నిర్ధారించే పత్రాలు తదితర ఆధారాలను అధికారులు పరిశీలించవచ్చు. ఆధార్ను గుర్తింపు ధ్రువీకరణకు ఉపయోగించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది; అయితే అది పౌరసత్వానికి ఆధారంగా పరిగణించరాదు.
అదేవిధంగా ఓటరు జాబితాలో పేరు నమోదు, సవరణ, చిరునామా మార్పు లేదా పేరు తొలగింపు వంటి అంశాలకు ఎన్నికల సంఘం నిర్దేశించిన సంబంధిత ఫారాలను ఉపయోగించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత BLOను సంప్రదించి అవసరమైన వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
S.I.R. ప్రక్రియలో భాగంగా తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ఆధారాలతో నిర్ణీత ప్రక్రియ ప్రకారం స్పందించడం ద్వారా ఓటర్ల జాబితాలో సరైన వివరాలు నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.
ఈ సమావేశంలో స్థానిక అధికారులు, BLOలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
