
తెలంగాణ సామ్నా బ్యూరో: అనుబంధాలు లేవు. ఆత్మీయతలు లేవు. కుటుంబ జీవనం పట్టదు. సాంప్రదాయం, నడవడిక, ధర్మం ఇవన్ని గాలి మాటలే. వట్టి మూటలే. ఏది గుర్తు రాదు. తాను చావాలనే కాదు. తనమీద అధారపడ్డ వారిని కూడా చంపుకొని తనతో తీసుకెళ్లాలనే క్షణికావేశం మాత్రం గుండెల నిండా నిండుకుంటుంది. ఆ క్షణం తీసుకునే బాధకరమైన, కఠినమైన నిర్ణయం కుటుంబాన్నే కుప్పకూలుస్తుంది. ఆ క్షణికావేశానికి కారణాలు ఏవైనా కావచ్చు. కాని తమతో పాటుగా ఏమీ తెలియని వారు కూడా బలి అవుతుండడం విషాదం నింపుతుంది.
ఇలాంటి సంఘటనే ఒకటి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మద్దులపల్లిలో జరిగింది. భర్త చేసిన నిర్వాకం వల్ల కుటుంబంలో కలతల చిచ్చురేగి ఆ కుటంబాన్ని దహించివేసింది. జగిత్యాలకు చెందిన హరికకు దాదాపు 10 సంవత్సరాల క్రితం తిరుపతితో పెళ్లి అయ్యింది. ఆ జంటకు ఇద్దరు సంతానం బాబుకి తొమ్మిదేళ్లు కాగా అమ్మాయికి ఏడేళ్లు. భర్త తన కులవృత్తి అయిన ఒగ్గు కథలు చెప్పడంతో పాటుగా వ్యవసాయం చేస్తాడు. ఆ క్రమంలోనే పలు గ్రామాలు వెళ్లి రావడం అనేది ఆ వృత్తిలో అతి సాధారణంగా జరిగేదే. భర్త చెప్పే ఒగ్గుకథలతో, చేసే వ్యవసాయంతో ఆ ఇల్లు సజావుగానే సాగేది. హరిక కూడా వ్యవసాయ పనుల్లో భర్తకు చేదోడు వాదోడుగా వుండేది.
ఆ కుటుంబానికి ఏం పర్వాలేదు. మంచిగానే బ్రతుకుతున్నారు అని అనుకునే క్రమంలోనే గురువారం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఏం జరిగిందో.. ఏలా జరిగిందో.. ఎందుకు జరిగిందో? తెలియదు కాని పిల్లలు సాయత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తరువాత వారిద్ధరికి విషం ఇచ్చి తాను తాగింది. ఈ విషయాన్ని భర్తకు వీడియో కాల్ చేసి మరి చెప్పింది. భర్త వచ్చేసరికి ముగ్గురు సృహ తప్పి పడిపోయి వున్నారు. వెంటనే ముగ్గురిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో శక్రవారం ఉదయం చికిత్స పొందుతు హైదరాబాద్లో హరిక మరణించింది. పిల్లలు ఇద్ధరు కరీంనగర్లో ఆదివారం ఉదయం మరణించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో హరిక తన ఇద్దరు సంతానానికి విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఈ సంఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. అయితే హరిక భర్తకు మరోక మహిళతో వివాహేతర సంబంధం వుందని ఈ విషయం మీదే భార్యభర్తలకు గొడవ జరిగిందని, అందుకే హరిక తన పిల్లలకు విషమిచ్చి తాను తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు భర్తకు వివాహేతర సంబంధం వున్న మహిళను ఇంటికి కూడా తీసుకువచ్చినట్లు హరిక చెల్లెలు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగి ముగ్గురు ప్రాణాలను బలిగొన్నది.
క్షణికకాల సుఖం కోసం పరిగెత్తిన భర్త, క్షణికావేశంలో పిల్లలతో సహ ఆత్మహత్య చేసుకున్న భార్య వెరసి ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఎన్నో కుటుంబాలకు ఇది కనువిప్పుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
