ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు దక్షిణామూర్తి.
(సిహెచ్ మధుకర్, జగిత్యాల్)
మతం, కులం, భాష, వేషం వేరే అయిన మన సంస్కృతి ఒకటేనని భారతదేశాన్ని ఐక్యంగా వుంచి మన హిందు సంస్కృతినీ రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తెలంగాణ ప్రాంత కార్యకారిని సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవాన్ని నగర పద సంచలనం నిర్వహించారు.ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ స్వయం సేవకులు పూర్ణ గణవేశతో నగరంలో పథసంచలనం నిర్వహించారు. రెండు వాహినీలుగా వారు పదసంచలనం చేయడం ప్రత్యేకత. గీత విద్యాలయం నుండి ఒక వాహిని, హనుమాన్ వాడ బీరప్ప టెంపుల్ నుండి మరోవాహిని పథసంచలనం నిర్వహిస్తూ తహశీల్ చౌరస్తా వద్ద ఒకటిగా కలిసిపోయి విద్యానగర్ రామాలయం వరకు చేరుకున్నారు. పద సంచలనంలో దారి పొడవున మహిళలు భగవద్వజానికి పూలు చల్లి స్వాగతం పలికారు. ఆ తరువాత విద్యానగర్ రామాలయ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓరుగంటి నితిన్ రావు పాల్గొనగా ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్, జిల్లా సంఘచాలక్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, నగర సంఘచాలక్ పురుషోత్తం పాల్గొన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న బూర్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన భారతదేశాన్ని మన అనైక్యత కారణంగా విదేశీయులు పరిపాలించారన్నారు. దేశానికి ఎప్పుడు ఆపద కలిగినా మహనీయులు జన్మించి దేశాన్ని కాపాడారని తెలిపారు. గ్రీకుల నుండి మొగలుల కాలం తరువాత ఆంగ్లేయులు తదితర విదేశీయులను ఎదిరించి రాణా ప్రతాప్ శివాజీ లాంటి మహావీరులు మన దేశాన్ని కాపాడారని తెలిపారు. రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి, వివేకానంద, శంకరాచార్య లాంటి వ్యక్తులు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడారని వివరించారు. సంస్కృతి ఎంత గొప్పదైనా దానిని కాపాడుకునే సమాజం లేనట్లయితే ఆ దేశం మనుగడ అసాధ్యమని, దీనిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని 100 సంవత్సరాల క్రితం ప్రారంభించాడని వివరించారు.
ప్రతిరోజు ఒక గంట సేపు శాఖా కార్యక్రమాల ద్వారా వ్యక్తి నిర్మాణ కార్యాన్ని ఆర్ఎస్ఎస్ చేపడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందిన ఎంతోమంది స్వయం సేవకులు సమాజంలోని అన్ని జీవన రంగాల్లో తమ ప్రభావాన్ని చూపుతూ ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.ఒకప్పుడు హిందువులు ఒక్కటిగా కలిసి ఉండే పరిస్థితి ఉండేది కాదని 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ కృషి వల్ల నేడు లక్షలాది హిందువులు గర్వంగా తాము హిందువునని చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారా సంఘాన్ని వ్యతిరేకించే వారు సైతం సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు.
ఆర్ఎస్ఎస్ ను పూర్తిగా వ్యతిరేకించిన మొదటి ప్రధాని నెహ్రూ చైనా యుద్ధంలో భారత సైన్యానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలకు గుర్తింపుగా 1963 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్వయం సేవకులను ఆహ్వానించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు నిత్య శాఖలో పాల్గొని దేశం కోసం, ధర్మం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన 500 మంది గణ వేషధారి స్వయం సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు.
