
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
గ్రామ స్థాయిలో భారత ప్రభుత్వ జన సురక్షా భీమా పథకాలైన ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన (PMJJBY) మరియు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన (PMSBY) పై అవగాహన కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓ రామకృష్ణ ఆర్బీఐ–ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా “పి.ఎమ్.ఎస్.బి.వై”, “పి.ఎమ్.జె.జె.బి.వై” ఇన్సూరెన్స్ పథకాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
అయిలాపూర్ గ్రామ సర్పంచ్ రామకృష్ణ గారు మాట్లాడుతూ, ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీస్లో ఖాతా కలిగి ఉండి, 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకాలకు అర్హులని తెలిపారు. అలాగే అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, జన్ ధన్ ఖాతాలు, ఆర్బీఐ డి.ఇ.ఎ ఫండ్ (క్లెయిమ్ చేయని డిపాజిట్ ఖాతాలు) గురించి వివరించారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాల వల్ల డబ్బులు కోల్పోయినట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించిన సందర్భంలో, నామినీకి ప్రభుత్వానికి నమోదు చేసిన బ్యాంక్ ఖాతాలో రెండు లక్షల రూపాయలు, అవయవం కోల్పోయిన సందర్భంలో ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయబడుతుందని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సౌమ్య, వార్డు సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది శిరీష, మహేశ్వరి, మహేష్, సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు నాగేంద్ర ప్రసాద్, నవీన్, పంచాయతీ కార్యదర్శి నవీన్, కారోబార్ అశోక్, గ్రామ వివిఓ లు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
