(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జూలై 13: ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించే దిశగా అధికారులు చొరవ చూపాలని కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. జివాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఎల్. జివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నందున ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 10, మున్సిపల్ శాఖకు 2, పంచాయతీరాజ్ శాఖకు 1, ఆప్కారి శాఖకు 2 వినతులు వచ్చినట్లు తెలిపారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు డీఈఈ (పంచాయతీరాజ్), ఏఈ (హౌసింగ్), ఐసీడీఎస్, ఏఈ (టీజీఎన్పీడీసీఎల్), ఏఈఈ (ఆర్డబ్ల్యూఎస్), ఆర్ అండ్ బి, ఎంపీవో (పంచాయతీరాజ్), ఏఈఈ (ఆర్ అండ్ బి) తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈఈ (పంచాయతీరాజ్) ఎం. సత్యనారాయణ, ఏఈఈ (ఆర్ అండ్ బి) బి. లక్ష్మీకాంత్, ఏఈ (హౌసింగ్) మాధురి శ్రీ, ఏఈ (టీజీఎన్పీడీసీఎల్) ఎస్. శ్యామ్, ఏఈఈ (ఆర్డబ్ల్యూఎస్) ఎస్. సాయి, ఎంపీవో (పంచాయతీరాజ్) రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
