(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ హైస్కూల్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ మాల ధరించిన ఐదుగురు విద్యార్థులను స్కూల్ యాజమాన్యం క్లాస్రూమ్లోకి అనుమతించకపోవడంతో హనుమాన్ భక్తులు, స్థానిక హిందూ సంఘాల ప్రతినిధులు, బీజేపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
విద్యార్థులు హనుమాన్ మాల ధరించి రావడాన్ని స్కూల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసి, మాలను విరమించుకోవాలని, లేనిపక్షంలో స్కూల్లోకి అనుమతించబోమని చెప్పినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా మాలను విరమించాలంటే ముందుగా లీవ్ లెటర్ రాయాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. స్కూల్కు వస్తే మెడ పట్టుకుని బయటకు పంపిస్తామని కూడా హెచ్చరించారంటూ మాలధారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హనుమాన్ మాలధారులు, హిందూ సంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. విద్యార్థులకు వెంటనే అనుమతి ఇవ్వాలని, యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే కరస్పాండెంట్ మహర్షి అడ్డుచెప్పడంతో ఆగ్రహానికి గురైన కొందరు ఆందోళనకారులు స్కూల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పోలీసుల మధ్యవర్తిత్వంతో స్కూల్ యాజమాన్యం చివరికి దిగివచ్చి విద్యార్థులకు క్షమాపణ తెలిపి క్లాస్రూమ్లోకి అనుమతించింది. దీంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.
ఈ సందర్భంగా హనుమాన్ మాలధారులు మాట్లాడుతూ… అయ్యప్ప మాల, హనుమాన్ మాల, భవాని మాలలు ధరించిన భక్తులు తరచూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

