(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)
మెట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన బాలికపై సామూహిక అత్యాచారం కేసులో జగిత్యాల ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులు బాధితురాలు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు చిత్రీకరించి, వాటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తమ స్నేహితులతో కూడా ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటనలో కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది.
బుధవారం, జూలై 15 జగిత్యాల ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులు లోకిని రాజేష్ (ఏ1), దరంగుల సాయికుమార్ అలియాస్ సాయి (ఏ2), మొగిలిపాక అనిల్ కుమార్ అలియాస్ అనిల్ (ఏ3), కుంచెపు శివ (ఏ4), కుంచెపు వెంకటేష్ (ఏ5)లకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు ఎస్సీ/పోక్సో నెం. 269/2022, క్రైం నెం. 327/2020గా మెట్పల్లి పోలీస్స్టేషన్లో నమోదు కాగా, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని అత్యాచారం సంబంధిత సెక్షన్లు, పోక్సో చట్టం–2012, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం–2015, అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో మొదట సబ్ఇన్స్పెక్టర్ ఎన్. సదాకర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, అనంతరం సబ్ డివిజనల్ పోలీసు అధికారి మహ్మద్ గౌస్ బాబా నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత సబ్ డివిజనల్ పోలీసు అధికారి వి. రవీంద్ర రెడ్డి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక ప్రజా అభియోజకుడు చి. రామకృష్ణారావు వాదనలు వినిపించగా, కేసు పర్యవేక్షణలో సీఎంఎస్ విభాగానికి చెందిన పోలీసు సిబ్బంది సమన్వయంతో విచారణ పూర్తై నిందితులకు శిక్ష పడింది. ఈ తీర్పు బాధితులకు న్యాయం అందించడంలో కీలక మైలురాయిగా నిలిచిందని పోలీసులు పేర్కొన్నారు.
