
అనగనగా అవంతీ రాజ్యముండేడిది. ఆ రాజ్యానికి వెంకటవర్మ సర్వసైన్యాధ్యక్షునిగా వుండేడివాడు. ఆయనకు ఇద్దరు పుత్రులు. వినోదవర్మ. వివేకవర్మ. వెంకటవర్మ మొదట్లో సైన్యంలో సిపాయిగా పనిచేశాడు. సిపాయిగా కావాల్సినంత అనుభవం గడి0చిన తరువాత సైన్యంలోని ఒక ఆశ్వ విభాగానికి ఘటప్రముఖ్గా రాజుల వారు నియమించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగిన వెంకటవర్మ సర్వసైన్యాధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఒక సిపాయిగా సైన్యంలో చేరి సర్వసైన్యాధ్యక్షుడు కావడం ఆ రాజ్య చరిత్రలో సంచలనంగా మారింది.
మొదటినుండి వెంకటవర్మకు సంపాదనపై అమిత అసక్తి వుండేడిది. ఏ రకంగానైనా లెక్కలేనన్ని బంగారు నాణేలు కూడబెట్టాలని అనుకునేడివవాడు. సిపాయిగా వున్న సమయంలో నేరం చేసిన వారిని మందిరంలో ప్రవేశపెట్టమని రాజుగారు ఆదేశిస్తే సదరు ముద్ధాయిల వద్ద నుండి కొన్ని బంగారు నాణేలు తీసుకొని ముద్ధాయి లేడని ఉన్నతాధికారులకు తెలిపేడివాడు. ఉత్తమ జాతి ఆశ్వాలను కొనుగోలు చేసి సిపాయిలకు ఇవ్వమని రాజుగారు ఆదేశిస్తే, అందులో చాలా బంగారు నాణేలు మిగిలించుకొని నాసిరకం ఆశ్వాలను కొనేడివాడు. కాని అధికారుల్లో మటుకు తాను ఎంతో గొప్పగా పనిచేస్తున్నానని చెప్పుకునేడివాడు.
అలా అక్రమంగా తీసుకున్న నాణేల్లో నుండి కొన్ని నాణేలు పోగుచేసి ఉన్నతాధికారులకు రహస్యంగా అందజేసి వారి మెప్పు పొందేడివాడు. దానితో వెంకటవర్మ ఏం చేసినా చెల్లేది. అలా సర్వసైన్యాధ్యక్షుని స్థాయికి చేరుకున్నాడని అవంతీ నగరంలోని ప్రజలు అనుకునేడివారు. ఉన్నతాధికారులు, మంత్రుల మద్ధతు సంపూర్ణంగా సంపాదించుకున్న వెంకటవర్మ మెల్లిమెల్లిగా ఇంకా పెద్ధ మొత్తంలో బంగారు నాణేల సేకరణలో నిమగ్నమయ్యాడు.
అందుకు తగిన ప్రణాళికలు పకడ్భందిగా సిద్ధం చేసుకున్నాడు. అవంతీ నగరంలో నివాస వసతి లేని పేదవారిని గుర్తించి వారికి కుటీరాలు నిర్మించాలని పథకం వేసుకున్నాడు. ఇందుకోసం ముందుగానే రాజుల వారిని కలిసి పేదలకు ఉచితంగా కుటీరాలు నిర్మించి ఇస్తే తమ పేరు అవంతీ రాజ్యంలో సువర్ణ అక్షరాలతో లిఖించినట్లు అవుతుందని నమ్మించాడు. దీనితో రాజుగారు కూడా సరే అని సమ్మతి తెలియజేశాడు. ఆ తరువాత తనకు అత్యంత నమ్మకమైన కొందరు సైనికులను నియమించుకున్నాడు. నగరంలో వున్న పేదవారి దగ్గరి నుండి వినతిపత్రాలు తీసుకున్నాడు. ఆ సందర్భంగా తలా కొన్ని బంగారు నాణేలు రహస్యంగా సేకరించాడు. రాజుల వారు కుటీరాలు నిర్మించి ఇచ్చిన తరువాత మరికొన్ని బంగారు నాణేలు ఇవ్వాలని ముందస్తుగా మాట తీసుకున్నాడు.
అలా రాజుగారి పేరు నిలిపినట్టుగా నిర్మించిన కుటీరాలకు రాణిగారి పేరే పెట్టాడు. దీనితో రాజుగారు కూడా తెగ సంబరపడిపోయాడు. అలా సేవ చేసినందుకు వెంకటవర్మను అతని వందిమాగధులు ‘‘కుటీరాల వెంకటవర్మ’’ అని ముద్దుగా, గౌరవంగా పిలుచుకునేడివారు.ఆ తరువాత వెంకటవర్మ కుమారులు వినోదవర్మ, వివేకవర్మ రంగప్రవేశం చేశారు. పేదలకు ఇచ్చిన కుటీరాలకు సంబంధించిన స్థలాలను వారు కొనుగోలు చేసినట్టుగా దొంగ పత్రాలు సృష్టించి వారితో వేలి ముద్రలు వేయించుకున్నారు. ఎంతో నమ్మకంగా తమకు నివాసయోగ్యతను అందించిన త్యాగాలకు నిలయమైన వంశమని అందరు అమాయకంగా వేలిముద్రలు వేశారు.
(మిగితా రేపు)

