(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలోని పెద్దగుండు వద్ద రామారావుపల్లెకు చెందిన రైతులు మంగళవారం ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన విధంగా కొనుగోలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో అధికారులు అనవసర సాకులు చెబుతూ రోజులు గడుపుతున్నారని ఆరోపించారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అదేవిధంగా ప్రతి క్వింటాల్పై సుమారు 5 నుంచి 10 కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రావడం లేదని, తూకాలలో కూడా అన్యాయం జరుగుతోందని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్నా కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు త్వరితగతిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు హెచ్చరించారు.
