
(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలలో భాగంగా మంగళవారం శాంతి సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, కోరుట్లలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సీఐ కే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరిగింది.
ఈ సమావేశంలో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు చెందిన బీజేపీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికపై సీఐతో పాటు ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, శ్రీధర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది హాజరయ్యారు.
మొదటగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ, గతంలో మెట్పల్లి పరిధిలోని ఇబ్రహీంపట్నం సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాల ద్వారా ఆవులను తరలిస్తున్నట్లు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని సూచించారు.
అనంతరం సీఐ కే. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గోవు సర్వదేవతా స్వరూపమని పేర్కొన్నారు. గోవుల రక్షణలో ప్రజలు పోలీసులతో కలిసి పనిచేయాలని, “గోవుల రక్షణలో మమ్ములను కూడా భాగస్వాములుగా చేయండి” అని పిలుపునిచ్చారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని, తదుపరి చర్యలను పోలీసులు తీసుకుంటారని తెలిపారు.
గోవుల రక్షణ పేరుతో వాహనాలను వెంటపడడం, అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడి ప్రమాదాలకు గురికాకూడదని హెచ్చరించారు. చట్టాన్ని స్వయంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పోలీసుల మధ్య గోవుల రక్షణ, చట్టపరమైన అంశాలపై సందేహాలు, సలహాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో మూడు మండలాల బీజేపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
