(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
మున్సిపల్ ఎన్నికల హోరాహోరీ ప్రచారం బుధవారం జరిగిన పోలింగ్తో ముగిసింది. గెలుపే లక్ష్యంగా సాగిన “ప్రత్యక్ష యుద్ధం” నేటితో పరిసామాప్తి అయినట్లయింది. ఇక శుక్రవారం “పరోక్ష యుద్ధం” ద్వారా విజయం ఎవరిదో తేలిపోనుంది. ఇంటింటికీ తిరుగుతూ హామీలు గుప్పించడం, ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించడం, “ఓటరే దేవుడు” అంటూ బుజ్జగించడం, ఎవరి తరహాలో వారు చివరి నిమిషం వరకూ శక్తి వంచన లేకుండా పోరాటం సాగించారు.
ప్రచారం వేళ ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలు, నిశ్శబ్ద సమావేశాలు, గుప్త లెక్కలు, అన్నీ కలిపి ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈసారి ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ నిర్వహించగా, ఓటర్లు తమ ఓటును బ్యాలెట్ బాక్స్లో వేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అసలు ఉత్కంఠ ఇప్పుడు మొదలైంది.
కౌంటింగ్ ఈరోజు కాకపోయినా, బ్యాలెట్ బాక్స్లలో బందీ అయిన ప్రజా తీర్పు ఎవరి వైపు ఉందో అన్న ఆతృత అభ్యర్థులను ఉలిక్కిపడేలా చేస్తోంది. బయటకు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, లోలోపల మాత్రం “ఎదలోన భయముందయా” అన్న సందేహంతో దేవుడిని ప్రార్థిస్తూ, లెక్కలు వేసుకుంటూ గుండెల్లో గుబులు మొదలైంది.
ఎవరి కష్టం ఫలిస్తుంది?, ఎవరి రాజకీయ భవిష్యత్తు మలుపు తిరుగుతుంది?, అన్న ప్రశ్నలకు సమాధానం శుక్రవారం జరిగే కౌంటింగ్ రోజునే తేలనుంది. అప్పటివరకు అభ్యర్థుల ఎదలో భయం మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.
