(తెలంగాణ సామ్నా, రాయికల్)
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈనెల 09 నుండి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో గురువారం రాయికల్ మండలం లోని జగన్నాథ్ పూర్ గ్రామంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులందరికీ గ్రామస్తులు గుస్సాడి వేషధారణ, డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన చిత్రాలతో కూడిన టీ షర్టులు, టోపీలు ధరించి వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుప్రభాత్ మాట్లాడుతూ ఈ సంవత్సరపు ప్రధాన అంశం “కేవైసీ” సురక్షిత బ్యాంకింగ్కు తొలి అడుగు” అనే విషయంపై కేంద్రీకృతమై ఉందని అన్నారు .
ప్రజలలో సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను నవీకరించుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, సైబర్ భద్రతపై జాగ్రత్తలు పాటించడం మరియు ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు.
ప్రతి ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను వెంటనే నవీకరించుకోవాలని ఆమె కోరారు. కేవైసీ నవీకరణ ద్వారా బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండటమే కాకుండా, ఖాతాల దుర్వినియోగాన్ని నివారించవచ్చు మరియు లావాదేవీలు మరింత సురక్షితంగా ఉంటాయి. ప్రజలు తమ ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్వర్డులు వంటి గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ పంచుకోకూడదని, ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని సూచించారు. ఎవరికైనా పొరపాటున సైబర్ మోసాల వల్ల నష్టం జరిగినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలని కోరారు. అలాగే బ్యాంకు సంబంధిత వ్యవహారాలు, సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి రశీదు పొందాలని, నిర్ణీత గడువు లోపు సమాధానం రాకపోయిన, సంతృప్తికర సమాధానం లేకపోయినా ఆర్బీఐ అంబుడ్స్ మన్ ని సంప్రదించాలని సూచించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ హెడ్ అరుణ సవిత మాట్లాడుతూ ఈ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, వినియోగదారుల సమావేశాలు మరియు ఆర్థిక విద్యా శిబిరాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నిర్వహించడానికి ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుత ఆర్థిక ప్రణాళిక మరియు ప్రభుత్వ ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించ బడుతుందని అన్నారు.
ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్ సాయి మాట్లాడుతూ ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, కేవైసీ వివరాలను నవీకరించుకొని, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులను అనుసరించాలని కోరారు. ఆర్థిక అవగాహన ప్రతి కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.
ఆర్బీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ తమ గ్రామాన్ని ఎంచుకొని తమ గ్రామంలో సదస్సు నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కల్పించినందుకు గ్రామ సర్పంచ్, పాలకవర్గం, గ్రామస్తులు అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్, టిజీబి ఆర్ ఎం రాజ నరేంద్ర, ఎమ్మార్వో నాగార్జున, ఎంపివో సుష్మా, ఏఎస్సై యూబీఐ, ఎస్బీఐ శాఖల మేనేజర్లు శంకర్, నరేష్, పవన్ కుమార్, మాధురి, ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్, సిఎఫ్ ఎల్ కౌన్సిలర్లు నాగేంద్ర ప్రసాద్, నవీన్, రాజేష్, మేఘమాల, సెర్ప్ సిసి లావణ్య, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ మల్లయ్య, కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు మరియు మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
