
తెలంగాణ సామ్నా బ్యూరో: దాదాపుగా 7.25 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో అక్కడ వున్న వణికించే చలి కంటే ట్రంప్ విధిస్తున్న అంక్షల వల్ల, చట్టాల వల్ల ఎక్కువగా వణుకు పుడుతుందనేది వాస్తవం అని ప్రవాస భారతీయులు ఆవేదనతో చెబుతున్నారు.
సరైనా పత్రాలు లేకుండా అమెరికాలో దాదాపుగా 1కోటి 50 లక్షల మంది వుంటారని అమెరికా అంచనా వేస్తుంది. ఇందులో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు వుంటారని అంచనా. ఎక్కువగా అమెరికా సరిహద్దు వున్న మెక్సికో, ఆ తరువాత సాల్వెడార్ ప్రజలు అమెరికాలో అక్రమంగా వుంటారు. వీరిందరి గురించి ఎన్నికల ప్రచారం నుండి తనదైన శైలిలో తాను గెలిచాకా ఏం చేస్తానో చెప్పిన ట్రంప్, అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి రోజు నుండే తల అధికార కొరడా రaళిపించడం ప్రారంభించాడు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా వున్న అమెరికాలో అక్రమంగా వున్న ఆయా దేశాల ప్రజల భవిష్యత్తు ఎలా వుండబోతున్నది అనేది చర్చ తాజాగా జరుగుతున్నది.
అమెరికాలో జన్మించిన ఇతర దేశాల పౌరులకు జన్మత: లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని కార్యనిర్వహక ఉత్తర్వులను ట్రంప్ ఇచ్చారు. దీనితో భారతీయులకు అమెరికాలో జన్మనిచ్చిన సంతానానికి అమెరికాలో పౌరసత్వం లభించదు. గతంలో ఇలా వుండేది కాదు. అమెరికాలో జన్మనిస్తే చాలు. వారికి అమెరికా పౌరసత్వం లభించేది. తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం వుందా? లేదా? అనే ప్రశ్న వచ్చేది కాదు. ఈ చట్టం వుండడం వల్లే ప్రపంచంలోని చాలా మంది అమెరికాకు ‘‘బర్త్ టూరిజం’’ కోసం వెళ్లేవారు. అంటే తమ సంతానానికి అమెరికా పౌరసత్వం వుండాలని కోరుకునే వారు ప్రత్యేకించి అమెరికా వెళ్లి అక్కడే బిడ్డకు జన్మనిచ్చేవారు. ఇది భారతదేశంలోని చాలా మంది సెలబ్రిటిలు చేసిందే. చేస్తున్నదే. అంతేకాకుండా అమెరికాలో అక్రమంగా వుంటున్న వారైనా లేక అమెరికా పౌరుడు కాని చట్టబద్ధత లేని, శాశ్వత నివాసి కాని వారి సంతానానికి కూడా అమెరికా పౌరసత్వం లభించదు.
గతంలో విదేశాల నుండి అమెరికా వెళ్లి అక్కడ పౌరసత్వం వున్న యువకున్ని లేదా యువతిని పెళ్లాడినట్లు రిజిష్టర్ చేయించుకొనేవారు. అందుకు అక్కడ పౌరసత్వం వున్న వారికి కొంత మొత్తాన్ని చెల్లించేవారు. ఇది సాధారణంగా అక్రమంగా అమెరికాకు వెళ్లిన వారు అక్కడి పౌరసత్వం పొందే అతి సాధారణమైన సాంప్రదాయబద్ధమైన పౌరసత్వ ప్రక్రియ. ఆ తరువాత పౌరసత్వం పొందడానికి అమెరికాకు తాత్కాలికంగా వెళ్లిన వారు ప్రయోగాలు చేశారు. విదేశాల నుండి వలస వచ్చే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో నాణ్యమైన సేవలు అమెరికాకు అందడం లేదనేది మరో సమస్య. దానితో పాటుగా శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తుతున్నది. వలసలు పెరగడం వల్ల అమెరికా అస్విత్వానికి ముప్పు కలిగే ప్రమాదం కూడా ఎర్పడే పరిస్థితి ఎర్పడిరదన్న వాదనలు వస్తున్నాయి.
దీనితో గత ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పౌరసత్వంను ఒక సమస్యగా అమెరికా ప్రజల ముందు వుంచారు. దానికి అనుగుణంగా నే అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే పౌరసత్వంపై ఆంక్షలు విధించడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చానీయంశం అవుతుంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం భారతదేశ యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వున్నట్లుగా చెబుతున్నారు.
