(బాలే అజయ్ – 9290277727, మెట్పల్లి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఇంటి స్థల ఆక్రమణ, అక్రమ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో న్యాయం కోసం ఓ కుటుంబం చేస్తున్న పోరాటం ఐదు ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. కోర్టు తీర్పు, మున్సిపల్ స్పీకింగ్ ఆర్డర్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు చర్యలు చేపట్టకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని ఆదర్శ్నగర్కు చెందిన అల్లే రేణుక భర్త నాగరాజు కుటుంబానికి చెందిన ఇంటి స్థలానికి సంబంధించి 2021లో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ పరిధిలోనీ స్థలంలో పడమర వైపున నిర్మించుకున్న ఇంటిని, ప్రహరీ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఆరోపించారు. ఈ విషయమై అధికారులను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగకపోవడంతో 2022లో సీడీ రికార్డింగ్ మరియు చట్టపరమైన పక్కా ఆధారాలతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
ఈ కేసును విచారించిన కోర్టు O.S. No.60 of 2022లో 11-12-2023న బాధితులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు.
తదనంతరం హైకోర్టు W.P. No.22270/2025 ఆదేశాల మేరకు మెట్పల్లి మున్సిపాలిటీ అధికారులు G1/UC/014/MCM/2025 నంబర్తో 04-11-2025న స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019 ప్రకారం జగ్గుల అజయ్ పేరుతో ఆక్రమిత స్థలంలో నిర్మించినట్లు పేర్కొన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించినట్లు బాధితులు తెలిపారు.
అయితే కోర్టు తీర్పు, మున్సిపల్ స్పీకింగ్ ఆర్డర్లు వెలువడి నెలలు గడిచినా ఇప్పటివరకు అక్రమ నిర్మాణాన్ని తొలగించే చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ నిర్మాణ అనుమతుల వ్యవహారంలో లంచాలు తీసుకున్నారంటూ జగ్గుల లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అధికారులు ఇద్దరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. దీంతో నిర్మాణ అనుమతుల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ, కోర్టు ఆదేశాలు, మున్సిపల్ స్పీకింగ్ ఆర్డర్లు ఉన్నా అక్రమ నిర్మాణంపై తుది చర్యలు తీసుకోకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు మున్సిపల్ స్పీకింగ్ ఆర్డర్లు, మరోవైపు అధికారులపై శాఖాపరమైన చర్యలు జరిగినప్పటికీ అక్రమ నిర్మాణంపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
