(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువకుడు దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, కోరుట్ల పట్టణంలోని బీసీ కాలనీ (అల్లమయ్య గుట్ట) ప్రాంతంలో నివాసం ఉంటున్న, పోతారం గ్రామానికి చెందిన వాసాల రవి (50) ఏప్రిల్ 27, 2026 సోమవారం నాడు దుబాయ్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు.
మృతుడు దుబాయ్లోని సి.ఆర్.సి కంపెనీలో బిల్డింగ్ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకున్న ఆయన, సోమవారం ఉదయం నిద్రలేవకపోవడంతో సహచరులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే క్యాంప్ సెక్యూరిటీకి సమాచారం అందించగా, వారు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లిన రవి ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఇదిలా ఉండగా, మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కంపెనీ అధికారులు మృతదేహం తరలింపుకు మరో రెండు నుంచి మూడు రోజులు పట్టవచ్చని తెలిపారు.
