(తెలంగాణ సామ్నా డెస్క్)
రైతు డిస్కం నిర్ణయం పై ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయంపై రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగం ఒక సేవారంగమని, దానిని రాజకీయ ప్రయోగాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా విద్యుత్ అంశాల్లో తప్పిదాలు చేయడంతో ఓడిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందని వ్యాఖ్యానించారు.
విద్యుత్ రంగం అభివృద్ధి బి ఆర్ ఎస్ పాలనలోనే గణనీయంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ మూలాధారమని, నిరంతర విద్యుత్ సరఫరా లేకపోతే వ్యవసాయం నిలబడదని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై కేంద్ర ఆదేశాలను గతంలోనే అసెంబ్లీలో వ్యతిరేకించామని, రైతులపై అదనపు భారం మోపకూడదని తమ పార్టీ స్పష్టం చేసిందని తెలిపారు.
రైతు డిస్కం ఏర్పాటు నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ కమిషన్ (ERC) పరిధిలో ఉండగా ముందే అమలు తేదీ ప్రకటించడం ఆశ్చర్యకరమని అన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా, అసెంబ్లీ చర్చ లేకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం తగదని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంస్థలను బలహీనపరచి, వాటిని ప్రైవేటీకరణ వైపు నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విద్యుత్ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని, వాటిని కాపాడకుండా కొత్త డిస్కం ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు.
అధిక ఖర్చుతో కూడిన థర్మల్ విద్యుత్ను రైతు డిస్కంకు కేటాయించడం తప్పు నిర్ణయమని విమర్శించారు. ఈ చర్యలు కొనసాగితే రాష్ట్రం బషీర్ బాగ్ ఘటనల వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరిక కూడా చేశారు.
రైతు డిస్కం ప్రతిపాదనను ఈ ఆర్ సి వెంటనే తిరస్కరించాలని, దీనిపై విస్తృత ప్రజా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పురుకుటపు గంగారెడ్డి, ముస్కు శ్రీనివాస్, గడ్డం శేఖర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,దమన్నపేట దేవయ్య తదితరులు ఉన్నారు.
