(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోరుట్ల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక సీఎంఎస్ (CMS) గార్డెన్లో గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని స్వయంసేవకులతో పాటు హిందూ సమాజ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన జిన్నా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సంఘ్లో గురుపూజ నిర్వహణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక భావనను వివరించారు. త్యాగం, సేవ, శీలం, సమర్పణ, దేశభక్తికి ప్రతీకగా నిలిచే భగవధ్వజాన్ని గురువుగా స్వీకరించడం సంఘ్ సంప్రదాయమని తెలిపారు. వ్యక్తి కంటే విలువలు శాశ్వతమైనవనే భావనతో వ్యక్తిపూజకు తావు లేకుండా భగవధ్వజాన్ని గురువుగా ఆరాధించడం సంఘ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
అనంతరం స్వయంసేవకులు భగవధ్వజానికి పుష్పార్చన చేసి గురుదక్షిణ సమర్పించారు. దేశం, ధర్మం, సమాజ సేవకు అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ్ నగర బాధ్యులు, స్వయంసేవకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

