
ప్రజలకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్) బుధవారం కథాలపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి, విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు సేవలు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులపై విశ్వాసం ఉంచి అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టం పట్ల అవగాహన పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తులో వేగం, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత ధోరణి పాటించాలని తెలిపారు.
రిసెప్షన్ విభాగాన్ని పరిశీలించిన ఎస్పీ, పిటిషన్ మేనేజ్మెంట్లో నమోదు చేసిన దరఖాస్తులను తనిఖీ చేశారు. ప్రతి ఫిర్యాదుదారుడికి పిటిషన్ మేనేజ్మెంట్ ద్వారా రూపొందించిన రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను 5ఎస్ విధానంలో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఫైళ్లను క్రమబద్ధంగా భద్రపరచాలని సూచించారు.
అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుత వైఖరి పాటించాలని సూచించారు. శాఖలో అమలులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తనిఖీ అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటి, పచ్చదనం, పరిశుభ్రత పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, డీసీఆర్బీ ఎస్సై ప్రదీప్, కథాలపూర్ ఎస్సై రవికిరణ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
