
తెలంగాణ సామ్నా బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భారీకుదుపొకటి నమోదు కాబోతుంది. వైఎస్సార్ పార్టీ ముఖ్యుడు, జగన్ సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి పార్టీని, రాజ్యసభ సభ్యత్వాన్ని వీడుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తనకు ఏ పార్టీలో చేరే ఉద్ధేశ్యం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన పెర్కోన్నారు. తనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానని ట్వీట్ చేశారు. తనకు జనసేన అధినేత పవన్తో వ్యక్తిగతంగా స్నేహం వుందని చెప్పుకున్నారు.
విజయసాయి రెడ్డి ప్రకటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. వైఎస్సార్ పార్టీలో నెంబర్ టూ గా చెలామణి అయిన ఆయన రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం వెనక భిన్న కథనాలు వస్తున్నాయి.
గతంలో ఓ వివాహితకు సంబంధించిన నైతిక విలువల సమస్యలో సతమతమైన విజయసాయి రెడ్డి రాజకీయంగా కొంత వెనకబడ్డట్లు కనిపించారు. రాజకీయంగా ఏపి రాజకీయాల్ని శాసించిన చోట ఆస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో విఫలమవుతున్నట్లుగా అనిపించిన క్రమంలోనే రాజకీయాల్ని వదిలేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనతో వివిధ పార్టీల నాయకులు భిన్న వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆయన పార్టీని వీడడం వ్యక్తిగతంగా జగన్కు తద్వారా పార్టీకి తీరని నష్టం చేసే అవకాశాలు వున్నట్లుగా రాజకీయా విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.
