

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రణాళిక’ లో భాగంగా సోమవారం ఉదయం కోరుట్ల పట్టణంలో ‘2K రన్’ ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక కృష్ణా మందిరం వద్ద ప్రారంభమైన ఈ పరుగులో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, మున్సిపల్ కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు, పురపాలక సంఘం సిబ్బంది, యువతీ యువకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డులో శ్రమదానం నిర్వహించాలని, కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ కోరుట్లను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్దే తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, మార్కెట్కు వెళ్లేటప్పుడు బట్ట సంచులను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
