(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులు బత్తుల రాజేశ్వర్ గారి పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రముఖ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమై, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో హృద్యంగా సాగింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, రాజేశ్వర్ గారు తమ సేవాకాలంలో అనేకమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించి, గణిత శాస్త్రంపై ఆసక్తి పెంపొందించడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన బోధనా విధానం, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ఉన్న మమకారం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ బృందం సభ్యులు మాట్లాడుతూ, సహచరుడిగా రాజేశ్వర్ గారి సహకారం ఎప్పటికీ మరవలేనిదని తెలిపారు. విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఆయన బోధించిన పాఠాలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయని భావోద్వేగంగా వివరించారు.
కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు రాజేశ్వర్ గారిని శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఆయనతో కలిసి సేవలందించిన శ్రీమతి విజయ రాణి గారిని కూడా ప్రత్యేకంగా సత్కరించారు.
పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, “మా జీవితాల్లో గురువు గారి పాత్ర ఎంతో గొప్పది. ఆయన బోధించిన విలువలు నేటికీ మాకు మార్గదర్శకంగా ఉన్నాయి” అని కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.
చివరిగా రాజేశ్వర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ స్థాయిలో సన్మానం అందించడం ఆనందంగా ఉందని, తన సేవలలో సహకరించిన సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సంగంబట్ల నరసింహమూర్తి వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా సర్పంచ్ దేవనపల్లి రామకృష్ణ, ఎం.ఈ.ఓ గంగుల నరేషం, ఎం.ఈ.ఓ లోగిని శ్రీనివాస్, ఎమ్.సి.సి కోరుట్ల పన్నాల అంజిరెడ్డి పాల్గొన్నారు.
అతిథులుగా వడ్లకొండ గంగాధర్, వనపర్తి శ్యామల, లోగిని కృష్ణయ్య, సి. ఆనంద్, బి. ఆనంద్, ఎం. రాజేంద్రప్రసాద్, ఎస్. కిషన్, ఏ. వెంకటరాజం, రాంప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
