(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా, జగిత్యాల)
జగిత్యాల పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా ఎంపికైన రోగులకు గురువారం విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. గొల్లపల్లి మండలం లొత్తునూరు గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరంలో మొత్తం 33 మందిని శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు.
అందులో 30 మందికి “పార్థ హాస్పిటల్” వైద్యుల సహకారంతో, కరీంనగర్ లోని “రేకుర్తి హాస్పిటల్” లో కంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. మిగిలిన ముగ్గురు రోగులకు బీపీ, షుగర్ పరీక్షల అనంతరం తక్షణ శస్త్రచికిత్స చేయడం అనుకూలం కాదని వైద్యులు సూచించడంతో వారిని తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, సమాజంలోని అట్టడుగు వర్గాలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా అంధత్వ నివారణ లక్ష్యంగా ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించడం గొప్ప సేవ అని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తరించాలని సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.సి.ఎమ్.సి తాటిపాముల వినోద్ కుమార్, అధ్యక్షులు వడ్లగట్ట శంకర్, ప్రధాన కార్యదర్శి గుండేటి గంగాధర్, కోశాధికారి సామల శ్రీహరి, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
