(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, అలీంకో సంస్థ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం కృత్రిమ అవయవాల కొలతల శిబిరాన్ని కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డులో గల సీఎంఎస్ గార్డెన్స్లో గురువారం నిర్వహించారు.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సహకారంతో జగిత్యాల జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచిత బ్యాటరీ ట్రైసైకిళ్ల కోసం దివ్యాంగుల ఎంపికతో పాటు కృత్రిమ అవయవాల కొలతలను తీసుకున్నారు.
కార్యక్రమంలో DWO ఆడెపు భాస్కర్, కోఆర్డినేటర్ కొండయ్య, CPDO పద్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై. అనూప్ రావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమకు అవసరమైన కృత్రిమ అవయవాల కొలతలు తీసుకోవడంతో పాటు రసీదులను భద్రపరచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారు వినియోగించుకోవాలని కోరారు.
మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అలీంకో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారం అందించారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వికలాంగుల విభాగం నాయకులు చెట్పల్లి ఓం ప్రకాష్, లంక దేవదాస్, మిట్టపల్లి వెంకట సాయి, బీజేపీ జిల్లా కార్యదర్శి సుదవేని మహేష్, ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్, మ్యాకల గణేష్, గందె నవీన్, ఎండోమెంట్ కార్మిక సభ కన్వీనర్ మాడవేణి నరేష్, యువ మోర్చా అధ్యక్షులు దమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
