(బాలే అజయ్, కోరుట్ల)
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆటో చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి, దొంగిలించబడిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం మొహమ్మద్ అజర్ అనే వ్యక్తి తన ప్యాసింజర్ ఆటో రిక్షా నెం. TS-02-UB-7230 ను కోరుట్ల రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఉంచి కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్కు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆటో కనిపించలేదని కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం నాడు వేములవాడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను ఖాలిద్ బిన్ మహమ్మద్ (41), వృత్తి డ్రైవర్, నివాసం నార్సింగి గ్రామం అని గుర్తించారు. విచారణలో కోరుట్ల రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశం నుండి TS-02-UB-7230 నెంబరు గల ప్యాసింజర్ ఆటోను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆ ఆటోను అల్లమయ్యగుట్ట శివారులో దాచిపెట్టి నార్సింగి వెళ్లినట్లు తెలిపాడు. నిందితుడి దగ్గర నుండి దొంగిలించబడిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచగా, రిమాండ్కు తరలించడం జరిగిందనీ కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు.
