
(బాలే అజయ్ – 9290277727)
భూషణరావుపేట గ్రామంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రామీణ వైద్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న సాయంత్రం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి రక్త నమూనాల సేకరణ చేసి పరీక్షలు నిర్వహించి, వారికి బ్లడ్ గ్రూప్ ఐడి కార్డులను అందజేశారు.
శిబిరానికి వచ్చిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గతంలో కూడా గ్రామంలో పలు ఉచిత వైద్య, రక్తదాన మరియు రక్త నమూనాల సేకరణ శిబిరాలు నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు.
జగిత్యాల జిల్లా స్థాయిలో రక్తదాతల సమన్వయంలో భాగంగా అవసరమైన వారికి రక్తదాతలను అందుబాటులోకి తీసుకురావడంలో కూడా శ్రీనివాస్ గౌడ్ సేవలందిస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు ముందుగానే వ్యక్తుల బ్లడ్ గ్రూప్ వివరాలు తెలిసి ఉంటే రక్తదానం చేయడం లేదా స్వీకరించడం సులభమవుతుందని, దీని ద్వారా తక్షణమే రక్తం అందించి ప్రాణాలను కాపాడగలమన్నారు.
అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుండి తమ క్లినిక్లో ప్రతిరోజు ఒక గంటపాటు ఉచిత ప్రథమ చికిత్స వైద్య సేవలు అందించడం ప్రారంభిస్తున్నామని తెలిపారు.
