(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భర్త చిత్తారి హరిబాబు పై కేసు నమోదైన నేపథ్యంలో, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దర్యాప్తులో భాగంగా, కట్నం కోసం వైష్ణవిని మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తెలిసిన హరిబాబు కుటుంబ సభ్యుల పాత్ర కూడా బయటపడింది. ఈ క్రమంలో నిందితుడి తల్లి చిత్తారి లక్ష్మి, అన్నలు చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్లపై కట్న వేధింపులు మరియు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా, ఈ ముగ్గురిని గురువారం (మార్చి 19, 2026) అరెస్ట్ చేశారు. అనంతరం వారిని డిఎస్పి రాములు ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానంలో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
