
తెలంగాణ సామ్నా డెస్క్: అన్ని మానవ సంబంధాలు ఆర్థిక బంధాలే అని అన్నాడోక పెద్దమనిషి. ఆ మాటల్ని నిజం చేస్తున్న సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. డబ్బుకు ఏ బంధం వుండదు. ఎలాంటి సంబంధాలు డబ్బు కోసం వదులుకోవాల్సిందే అని చెబుతున్న సంఘటన ఇది. భర్త చనిపోయాడు అనే బాధ మరిచిన భార్య, చెట్టంత కొడుకు లేకుండా పోయాడు అనే బాధ లేని తల్లి. ఇద్దరి దృష్టిలో కనిపిస్తున్నది ఆస్థి. శవం కాదు.
గిద్దలూరుకు చెందిన లక్ష్మీదేవి కొడుకు ఆచారి (31) మద్యానికి బానిస అయ్యాడు. ఈ నెల 7న బంగ్లా మీదినుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూనే ఆచారి మరణించాడు. ఆ తరువాత ఆచారి శవాన్ని దహన సంస్కారాలు నిర్వహించడానికి ఇంటికి తీసుకువచ్చారు. ఇంతవరకు కొడుకు, భర్త అనే సెంటిమెంట్ కనిపించినా ఆ తరువాత ఆచారి తల్లికి, భార్యకు మధ్యన వివాదం చోటు చేసుకుంది.
భర్త శవం ఇంట్లో వుండగానే ఆస్థి పంపకాలు జరగాలని కోడలు గొడవకు దిగింది. తన 3 సంవత్సరాల కొడుకు భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితిల్లో ఇపుడే ఆస్థి పంపకాలు కావాలని పట్టుబట్టింది. ఇంతటి దుఖ సమయంలో ఆస్థి పంపకాలు ఏమిటని చాలా మంది ప్రశ్నించారు. కాని ఆ భార్య వినలేదు. అటు అత్తకు చెప్పి చూశారు. అత్త కూడా ఆస్థి పంపకాలు ఇప్పుడు లేవు అని ఖరాఖండిగా చెప్పింది. దీనితో గొడవ పెద్దదయ్యిందిఅయితే ఆచారి తల్లి కొడుకు శవం ఇంట్లో వుండగానే అదేది పట్టనట్లు తన కూతురితో కలిసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు.
చెప్పుకోవడానికి వినడానికి చాలా చిన్నగా కనిపిస్తున్న ఈ సంఘటన తరుగుతున్న మానవ సంబంధాల పరిస్థితిని చెప్పలేక చెబుతున్నాయి. అత్త మీద నమ్మకం లేని కోడలు తన భర్త శవం ఇంట్లో వుండగానే ఆస్థి పంచాలని నిలదీసి వుండొచ్చు. అలాగే 3 సంవత్సరాల మనుమన్ని తీసుకొని కోడలు వెళ్లిపోతుందే కాని నా ఇంట్లో నాకు సేవ చేస్తూ వండదు కదా! అలాంటప్పుడునా కొడుకే లేనప్పుడు నా ఆస్థి నేను కోడలుకు ఎందుకు ఇవ్వాలి? అని అత్త అనుకొని వుండవచ్చు. నా భర్త చనిపోయిన తరువాత నాకు ఆ ఇంట్లో భద్రత వుండే ఆవకాశం లేదు కాబట్టిభర్త శవాన్ని ముందుగా పెట్టుకొని, కొడుకును చూపెట్టి కోడలు ఆస్థి అడిగివుండవచ్చు. ఓ కుటుంబంలో అత్త కోడళ్ల బంధాల్లో దినచర్యల్లో వుండే పంతాలు పట్టింపుల వల్ల ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్న వాదన వస్తున్నది.
భర్త శవాన్ని ఎదురుగా వుంచుకొని ఆస్థి కోసం నిలదీసిన కోడలుది తప్పా? లేక కొడుకు శవం ఇంట్లో వుండగానే తన కూతురుతో సహ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయిన తల్లిది తప్పా? లేక కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇవ్వని అత్తాకోడళ్ల తప్పా? మీరే కామెంట్ చేయాలి
