(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన అత్యవసర పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు కనీస పెన్షన్లు సకాలంలో అందించలేని ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు నిలిపివేసి, ఇప్పుడు వాటినే రాజీవ్ వికాస్ యోజన పేరుతో బ్రేక్ఫాస్ట్ పథకం, భీమా పథకాలు వంటి వాటిని కొత్తగా ప్రవేశపెట్టినట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు.
ఈ పథకాల కోసం రూ. 6000 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ ప్రజలకు లాభం ఏమీ జరగలేదని, అంతా సున్నా నే అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిక్లరేషన్ల గురించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
చనిపోయిన నాయకుల పేర్లను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం దౌర్భాగ్యకరమని సంజయ్ అన్నారు. ప్రభుత్వానికి స్పష్టమైన పాలసీ లేకుండా “2047 లక్ష్యాలు” పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రైతులు, ఉద్యోగులు, బీసీలు, జర్నలిస్టులు—ఏ వర్గానికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉపశమనం లేకుండా అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపారు.
తెలంగాణ అప్పులపై కూడా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన ప్రకారం 2023 నాటికి రాష్ట్ర అప్పు సుమారు రూ. 3.4 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6–7 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. “నిజం బూట్లు వేసుకునేలోపే అబద్ధం ప్రపంచం చుట్టేస్తోంది” అన్నట్లుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం నెలకు సుమారు రూ. 7 వేల కోట్లు అప్పులు చెల్లిస్తున్నట్లు ప్రచారం చేయడం పూర్తిగా అబద్ధమని, వాస్తవానికి కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. మీడియా మేనేజ్మెంట్ అధికార పార్టీకే అనుకూలంగా ఉండడం వల్ల నిజాలు బయటకు రావడం లేదని ఆరోపించారు.
ఇక భారీ ప్రాజెక్టుల పేరుతో కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని, గతంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులను ఇప్పుడు “ఫ్యూచర్ సిటీ” పేరుతో మళ్లీ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పనపై స్పష్టత లేదని తెలిపారు.
ఇటీవల రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, జీవన్ రెడ్డి మంచి నాయకుడని, అటువంటి నాయకుడు తమ పార్టీలోకి రావాలనుకుంటే ఘనంగా స్వాగతిస్తామని సంజయ్ తెలిపారు
